ఆత్మహత్యకు రాష్ట్రపతినే అనుమతి అడిగాడు
నోయిడా: తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించమంటూ ఓ వ్యక్తి భారత రాష్ట్రపతిని కోరారు. 54ఏళ్ల డీకే గార్గ్ గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ(జీఎన్ఐడీఏ) ఉద్యోగులు తనని వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని అనుమతి ఇవ్వమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఓ సంస్థ ఏర్పాటుచేసుకోడానికి అనుమతి కోరగా జీఎన్ఐడీఏ అధికారులు లంచం అడుగుతున్నారని, లంచం ఇస్తేనే ఇన్స్టిట్యూట్కి అనుమతి మంజూరు చేస్తామని అన్నారని తెలిపారు. ఆ అవినీతి, వేధింపులు తాను తట్టుకోలేకపోతున్నానని, ఎన్ఓసీ ఇవ్వడానికి ఏళ్ల తరబడి తిప్పుకొంటున్నారని, ఆ ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని అందుకు అనుమతివ్వమని గార్గ్ రాష్ట్రపతికి లేఖ రాశాడు.
దీనిపై జీఎన్ఐడీఏ సీఈవో దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ గార్గ్ ఆరోపణలను ఖండించారు. సరైన పత్రాలు సమర్పించనందునే ఎన్ఓసీ ఇవ్వడానికి ఆలస్యం అయివుంటుందని, విచారణ జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై నివేదికను అందిస్తామన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి